బిచ్కుంద, సెప్టెంబర్ 3: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ప్రజలకు గత రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మిషన్ భగీరథ నీటి కష్టాల నుంచి విముక్తి లభించింది. ఏళ్ల తరబడి తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులకు మూడవ వార్డు కౌన్సిలర్ ధర్పల్ కార్తీక సంతోష్ శాశ్వత పరిష్కారం చూపడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్డులో గత కొంతకాలంగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యపై కాలనీవాసులు తమ గోను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కౌన్సిలర్ ధర్పల్ కార్తీక సంతోష్ వెంటనే రంగంలోకి దిగి, అధికారులతో మాట్లాడి పైప్లైన్ సమస్యను పరిష్కరించారు. దీంతో కాలనీకి మళ్లీ భగీరథ నీరు సాఫీగా రావడం ప్రారంభమైంది.
తమ సమస్యను చెప్పిన వెంటనే స్పందించి, తక్షణ చర్యలు తీసుకుని నీటి కష్టాలు తీర్చిన కౌన్సిలర్కు కాలనీవాసులు, మహిళలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.






