పిట్లం: రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా పిట్లంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని, వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు, ప్రతాప్ రెడ్డి, పండితరావు పటేల్, నాల్చార్ రాజు, పాకలి విజయ్కుమార్, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.






